అక్బర్ చక్రవర్తికి వేటాడ్డం ఒక సరదా. ఆ సరదా వల్ల రాజ్యంలోని అడవులన్నీ నిర్వీర్యమైపోవడం బీర్బల్ను ఎంతగానో బాధించింది. బీర్బల్ ఈ విషయాన్ని అక్బర్ దృష్టికి తీసుకురావాలనుకున్నాడు. తగిన సమయం కోసం ఎదురుచూస్తుండగా ఒకరోజు అక్బర్ తన పరివారంతో కలిసి వేటకు వెళ్ళాడు. బీర్బల్ కూడా అతని వెంటే ఉన్నాడు. అడవికి వెళ్ళే తోవలో వారు ఒక చిలుకల గుంపు చెట్టుపై కూర్చుని అరవడం చూశారు. అక్బర్ బీర్బల్తో "బీర్బల్! నువ్వు పక్షుల భాషను అర్ధం చేసుకుంటానని చెప్పావుగా, ఆ చిలుకలు ఏమని మాట్లాడుకుంటున్నాయో చెప్పగలవా?" అని అడిగాడు.
బీర్బల్ వాటి మాటలను శ్రద్ధగా వింటున్నట్టు నటిస్తూ, "రాజా! ఈ చిలుకలు పెళ్ళి పద్ధతుల గురించి మాట్లాడుకుంటున్నాయి. పిల్ల వాడి తండ్రి ఏ పక్షులూ, జంతువులూ లేని ఐదు అడవులను వరకట్నంగా కావాలని అడుగుతున్నాడు. పెళ్లికూతురు తండ్రి ఇదేం కర్మ, పది ఖాళీ అడవులైనా కట్నంగా ఇవ్వడం సమ్మతమే అంటున్నాడు" అని చెప్పాడు.
ఇంకా ఏం మాట్లాడుతున్నాయో తెలుసుకోవాలన్న కుతూహలంతో అక్బర్, "మరి పెళ్లికొడుకు తండ్రి ఏమంటున్నాడు?" అని అడిగాడు.
బదులుగా బీర్బల్ "మహారాజా! పెళ్లికొడుకు తండ్రి అంత సులభంగా ఖాళీ అడవులను ఎలా ఇవ్వగలవని పెళ్లికూతురు తండ్రిని అడగగా, పెళ్లికూతురు తండ్రి ఈ రాజ్యపు చక్రవర్తికి వేటాడటం సరదా. ఆ సరదాతో ఎన్నో అడవులను నాశనం చేశాడు. ఆయన తన సరదాతో మరికొన్నింటిని కూడా పక్షులు, జంతువులు లేని అడవులుగా మారుస్తాడని చెబుతున్నాడు"
అని చిలుకల సహాయంతో బీర్బల్ తను చెప్పాలనుకున్న మాటలను తెలివిగా అక్భర్కు చెప్పేశాడు.
తన సరదా అడవులకు ఎంతటి దుర్గతి తీసుకువచ్చిందో గ్రహించిన అక్బర్ వెంటనే దానికి కళ్ళెం వేశాడు.
No comments:
Post a Comment